
-
కార్మికులు జీతాలడిగారని దేవుడి సేవలో కోత
-
సర్కారు వింత వైఖరిపై మండిపడుతున్న భక్తులు
-
అనంతపురం జిల్లాలోని ఘటన
అనంతపురం: భక్తరహళ్ళి క్షేత్రంలో ప్రసిద్ధి చెందిన మండలంలోని భక్తరహళ్ళి లక్ష్మీనరసింహస్వామి, జిల్లడగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో ఆర్జిత సేవలు ఐదు నెలలుగా ఆగిపోయాయి. స్వామి సేవలనే పట్టించుకునేవారు కరువయ్యారు. సేవలు నిలిపేసినట్టు నోటీసు అతికించారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే కార్మికులు ఎక్కువ మొత్తం అడగడంతో దేవదాయ శాఖ అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో కార్మికులు సేవలకు హాజరుకావట్లేదు. ఆ కారణంగా సేవలు ఆగిపోయాయి. దీంతో మొక్కుబడి చెల్లించేందుకు వచ్చే భక్తులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
ఈ రెండు దేవాలయాలు దేవదాయశాఖ పరిధిలో ఉన్నాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయాల ఆదాయం ఏడాదికి రూ.30 లక్షల వరకు ఉంటుంది. భక్తులు నిర్వహించే ఆర్జిత ఉత్సవాలు, కల్యాణోత్సవాల ద్వారా మరో రూ.8 లక్షల దాకా ఆదాయం సమకూరుతోంది. బ్రహ్మోత్సవాలకు రాలేకపోయిన భక్తులు, మొక్కుబడులు ఉన్నవారు ప్రత్యేకంగా ఆలయానికి వచ్చి స్వామివారికి ఉత్సవాలు, కల్యాణోత్సవం జరిపిస్తారు.
ఆలయంలో ఒకరోజు ఉత్సవం జరిపించాలంటే ఇద్దరు పూజారులు, 12 మంది కార్మికులు పాల్గొంటారు. ఉత్సవం చేయించేవారు ఆలయ రుసుము రూ.1000 చెల్లిస్తారు. దేవాలయం పరిధిలో 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్వామివారిని పల్లకిలో ఆశీనులు గావించి, ఆలయ ప్రదక్షిణలు చేస్తారు. అందుకు వారికి.. భక్తులు చెల్లించిన రూ.1000 రుసుమును ఇస్తారు. 12 మంది కార్మికులకు రూ.84 చొప్పున వస్తుంది.
రోజంతా పనిచేసినా రూ.84 మాత్రమే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో రోజుకు రూ.500 చెల్లించాలని కోరుతున్నారు. అందుకు దేవదాయ శాఖ వర్గాలు ససేమిరా అనడంతో కార్మికులు దేవాలయంలో పనులకు రావడంలేదు.
దీంతో ఉత్సవాలను నిలిపేసినట్టు ఆలయంలో నోటీసు అతికించారు. రుసుము పెంచితే..ఉత్సవ రుసుము రూ.6 వేలకు పెంచితే కార్మికులు అడిగినంత ఇచ్చే వీలుంటుంది. అలా చేస్తే భక్తులపై భారం పడుతుంది. వారు ఉత్సవాల నిర్వహణకు ఆసక్తి చూపకపోవచ్చని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ భారం దేవదాయ శాఖ భరించి, ఉత్సవాల నిర్వహణకు అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.





