
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్పై పన్నులను తగ్గించిన భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. అమెరికా ఒత్తిళ్ళు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును భారత్ కొనుగోలు చేసిందన్నారు.
ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డయలాగ్ (QUAD) దేశాల్లో భారత దేశం ఒకటి అని, అయినప్పటికీ, భారత దేశం అమెరికా ఒత్తిడిని తట్టుకుని, సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించడం కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేటుతో చమురును కొనుగొలులో చేసిందని ప్రశంసించారు.
స్వతంత్ర విదేశాంగ విధానంతో పాకిస్తాన్లో కూడా ఇటువంటిదానిని సాధించేందుకు తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం దిక్కు తోచని స్థితిలో అటూ ఇటూ పరుగులు తీస్తోందని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ అరాచక స్థితిలో ఉందన్నారు. మీర్ జాఫర్లు, మీర్ సాదిక్లు విదేశీ ఒత్తిళ్ళకు తలొగ్గి ప్రభుత్వాన్ని మార్చేశారన్నారు.





