
-
ఏడాది పొడవునా ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు
బాపట్ల: వేప చెట్టుకు శతవసంతాల వేడుకలు నిర్వహించి వృక్షాల పట్ల తమ ప్రేమను చాటుకున్నారు బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామస్థులు. నూతి సత్యనారాయణ అనే వ్యక్తి 1923 మే 21న గ్రామంలోని శ్రీరాజగోపాలస్వామి దేవాలయం ఎదుట చిన్న వేప మొక్కను నాటారు. అప్పట్లో రూ.50 వెచ్చించి మొక్క చుట్టూ రచ్చబండ ఏర్పాటు చేశారు. ఆలయం ఎదుట వేపచెట్టును లక్ష్మీప్రదాతగా భావించిన స్థానికులు నాటి నుంచి పూజలు చేస్తున్నారు.
ఈ నెల 21న ఈ వృక్షం వందో సంవత్సరంలోకి అడుగిడింది. దీంతో సత్యనారాయణ వారసులు ఈ చెట్టుకు వందేళ్ల వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థుల సహకారంతో చెట్టు చుట్టూ రచ్చబండకు మరమ్మతులు నిర్వహించారు. చెట్టుకు చీరకట్టి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. ఈ ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించేందుకు సహకరించాలని కరపత్రం ద్వారా వృక్ష ప్రేమికులను, భక్తులను కోరారు. పూజా కార్యక్రమంలో నూతి వెంకటరామశర్మ, నూతి శివప్రసాద్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.





