
న్యూఢిల్లీ: జపాన్లో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొననున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగా జపాన్ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్ సదస్సుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం, ఇండో- ఫసిఫిక్ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై ఆలోచనలు పంచుకునేందుకు ఈ సమావేశం గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. మే 23-24 మధ్య రెండు రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు భారత ప్రధాని.
“ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నాను. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ అభివృద్ధి, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించనున్నాం. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నాను. టోక్యో పర్యటన సందర్భంగా.. భారత్- జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు చేపడతాం. ఆ తర్వాత జపాన్లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొంటాను. ఈ గ్రూప్ మొదలుపెట్టిన పనుల పురోగతిని సమీక్షించేందుకు నాలుగు దేశాల నేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం. అలాగే.. ఇండో-ఫసిపిక్ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై మా ఆలోచనలను పంచుకోనున్నాం.”
– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
Source: EtvBharat





