
న్యూఢిల్లీ: దేశంలోని స్టార్టప్లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆదివారం ప్రధాని ఆన్లైన్ వేదికగా తన సందేశం అందజేశారు.
అందరి కోసం పాటుపడాలంటే మన సాధువులు ఎల్లప్పుడూ ప్రజల్లో స్ఫూర్తి నింపారని ప్రధాని కొనియాడారు. గణపతి సచ్చిదానందస్వామి జీవితం సైతం సమాజ సేవ, దానధర్మాలతో నిండి ఉందని, అనేక ఆశ్రమాలు, పెద్ద సంస్థ, వివిధ ప్రాజెక్టుల రూపంలో ఇది కనిపిస్తుందని ప్రశంసించారు.
పవిత్ర గ్రంథాలను ఉటంకిస్తూ, మానవాళి సంక్షేమం కోసం సాధువులు ఉద్భవించారని, వారి జీవితం సామాజిక అభ్యున్నతి, మానవ సంక్షేమంతో ముడిపడి ఉందనడానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితమే సజీవ ఉదాహరణ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దత్త పీఠంలో ఆధ్యాత్మికతతో పాటు ఆధునికత కూడా పెంపొందుతుందని ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.
Source: Nijamtoday





