News

గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దు.. భార‌త్‌కు అమెరికా అభ్య‌ర్థ‌న

400views

న్యూఢిల్లీ: భారత్ అన్నపూర్ణగా మరోసారి రుజువైంది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఆకలి కడుపులు మనల్ని ఆర్దిస్తున్నాయి. అవును నిజమే..! ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతున్నతరుణంలో గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దని ఇండియాను అమెరికా కోరింది.

ఎగుమతులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటోంది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండియా దేశంలో ధరల పెరుగుదలతో ఎగుమతులపై నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే దేశీయంగా పంట దిగుబడులు, ఎండల కారణంగా గత సంవత్సర కాలంలో 20 శాతం మేర గోధుమలు, గోధుమ పిండి ధర పెరిగాయి.

ప్రస్తుతం భార‌త్ చుట్టుపక్కల దేశాలకు వారి అవసరాలకు తగిన విధంగా గోధుమలు సరఫరా చేస్తోంది. ఈ పరిస్థితిలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతుల తగ్గించొద్దని, ఇండియా ఎగుమతులు తగ్గిస్తే ఆహార కొరత ఎక్కువవుతుందని రాయబారి థామస్-గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. పేద దేశాల ఆహార సంక్షోభాన్ని ఇండియా అర్థం చేసుకోవాలని అమెరికా అభిప్రాయపడింది.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉక్రెయిన్ నుంచి గోధుమలు ఎగుమతయ్యేవని పేద దేశాలకు బ్రెడ్ బాస్కెట్‌గా ఉండేదని యుద్ధనేపథ్యంలో ఉక్రెయిన్ కీలక ఓడరేవులను రష్యా నిరోధించడంతో ఇబ్బందులు తలెత్తాయంటోంది. ఆహార కొరతతో ఆఫ్రికా దేశాలు విలవిలలాడుతున్నాయని అమెరికా వివరించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి