
చార్ధామ్: ఈనెల మూడో తేదీన చార్ధామ్ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి 13 శుక్రవారం వరకు 31 మంది భక్తులు మరణించినట్టు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట వంటి కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. దీంతో ఛార్ధామ్ యాత్ర మార్గాల్లో భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈమేరకు ఉత్తరాఖండ్ ఆరోగ్య డైరెక్టర్ జనరల్ డాక్టర శైలజ భట్ వివరించారు.
సీఎం సూచన మేరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శైలజ పేర్కొన్నారు. పరీక్షల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తేలితే వారికి విశ్రాంతి తీసుకొమని చెప్పి, పరిస్థితి మెరుగుపడ్డాకే యాత్రలో పాల్గొనాలని సూచిస్తున్నట్టు చెప్పారు.
అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల మూడోతేదీన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరిచి చార్ధామ్ యాత్ర ప్రారంభించారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆరోతేదీన కేదార్నాథ్, ఎనిమిదోతేదీన బద్రీనాథ్ ఆలయాలను తెరిచారు.
Source: EtvBharat
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





