
న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితిలోని వ్యవస్థల్లో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం రూ.6 కోట్లు అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడేవారికి సమాచారాన్ని చేరవేయడానికి 2018లో భారత దేశం ప్రారంభించిన యుఎన్ఒ ప్రాజెక్టు కోసం ఈ సొమ్మును ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును ఐరాసకు భారత దేశ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆర్ రవీంద్ర అందజేశారు.
ఐక్య రాజ్య సమితిలో హిందీ వినియోగాన్ని విస్తరించడం కోసం భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని యుఎన్ఒ ఓ ప్రకటనలో తెలిపింది. Hindi@UN ప్రాజెక్టును 2018లో ప్రారంభించినట్టు పేర్కొంది. ఐరాస పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఐరాస కార్యకలాపాల గురించి ప్రజలకు హిందీలో వివరించడం, ప్రపంచంలోని సమస్యల పట్ల హిందీ మాట్లాడేవారికి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు పేర్కొంది.
యుఎన్ఒ గ్లోబల్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్తో కలిసి భారత దేశం 2018 నుంచి పని చేస్తోంది. ఈ శాఖకు సంబంధించిన వార్తలు, మల్టీమీడియా కంటెంట్ హిందీలో ఉండేవిధంగా చూడటం కోసం భారత ప్రభుత్వం ఎక్స్ట్రా బడ్జెటరీ కంట్రిబ్యూషన్ చేస్తోంది. దీంతో UNO Website, సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫేస్బుక్ కంటెంట్ కోసం హిందీలో ఓ పేజ్ని ఏర్పాటు చేశారు. ప్రతి వారం హిందీ న్యూస్ ఆడియో బులెటిన్ కూడా విడుదలవుతోంది.





