
న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన మరో కుట్రను సైన్యం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి భారత ఆర్మీ జరిపిన సంయుక్త ఆపరేషన్లో చాలాకాలంగా తప్పించుకుని తిరుగుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ మహమ్మద్ అష్రాఫ్ ఖాన్ అలియాస్ అష్రాఫ్ మౌల్వి, అతని సహచరులు ఇద్దరు హతమయ్యారు.
పహల్గావ్కు 15 కిలోమీటర్ల దూరంలోని బట్కూట్ అడవుల్లో సుమారు నాలుగు గంటల సేపు జరిగిన ఈ ఎన్కౌంటర్లో వీరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అష్రాఫ్ మౌల్వితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను యాత్రా మార్గంలో మట్టుపెట్టడం ద్వారా తాము జరిపిన మేజర్ ఆపరేషన్ విజయవంతమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్లో తెలిపారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, టెంగ్పావ కోకెర్నాగ్కు చెందిన అష్రాఫ్ మౌలి 2013లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరారు. అచిరకాలంలోనే కశ్మీర్లో లోయలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా మారాడు.