
తిరుపతి: గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో యువ రైతులు పాల్గొనేలా ప్రోత్సహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో గోశాల నిర్వాహకులతో ఈఓ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని పలు గోశాలల్లో 2,500 గోవులు మిగిలి ఉన్నాయని, వీటిని జూన్ నెలలోగా అవసరమైన రైతులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఈవో అన్నారు. నోడల్ గోశాలల్లో ఉన్న గోవుల ఆరోగ్యాన్ని పరీక్షించడం, గోవులకు అవసరమైన మేత, రైతులకు అందించేందుకు రవాణ ఛార్జీల కోసం ఆర్థిక సహాయం తదితర అంశాల పై చర్చించారు.
శ్రీకాళహస్తిలోని గోశాలలో మే రెండో వారంలో శిక్షణ కార్యక్రమం జరుగనుందని వారు ఈఓకు తెలిపారు. ప్రతి గోశాలలో ఒక్కో రకమైన నైపుణ్యం ఉందని, వాటిని ఉపయోగించుకొని చక్కటి పంచగవ్య ఉత్పత్తులు తయారు చేయవచ్చని వివరించారు.





