News

అమర్నాథ్ వెళ్ళే యాత్రికులకు ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ సర్టిఫికెట్ల జారీ

507views

అమ‌రావ‌తి: అమర్‌నాథ్ వెళ్ళే యాత్రికులకు అవసరమైన మెడికల్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్‌ రాఘవేంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు.

అమర్‌నాథ్‌ 2022 యాత్ర జూన్‌ 30 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఉంటుంది. యాత్రకు వెళ్ళేందుకు నిర్దేశించిన మెడికల్‌ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు, ఆధార్‌ కార్డు, వయసును ధ్రువీకరించే ఇతర సర్టిఫికెట్‌లతో దగ్గర్లోని ప్రభుత్వ బోధనాసుపత్రికి యాత్రికులు వెళ్లాలి. అక్కడి రిసెప్షన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వరుస క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించే తేదీని నిర్ణయిస్తారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పల్మనాలజీ, జనరల్‌ మెడిసిన్‌ వైద్యులతో కూడిన మెడికల్‌ బోర్డు దరఖాస్తు చేసుకున్న వారి వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి