చెన్నై: తమిళనాడులోని తంజావూరులో గత రాత్రి జరిగిన ఆలయ ఉత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. కలిమేడు ప్రాంతంలో జరిగిన ఉత్సవంలో విద్యుదాఘాతంతో 11 మంది సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
కలిమేడు ఎగువ ఆలయంలో ప్రతి ఏడాది ఉత్సవాన్ని నిర్వహిస్తారు. వేడుకలో భాగంగా రథాన్ని లాగుతారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమయ్యే రథోత్సవం తెల్లవారుజాము వరకు జరుగుతుంది. గత రాత్రి రథోత్సవం వైభవంగా ప్రారంభమైంది.
ఈ క్రమంలో తంజావూరు-పుతలూరు రహదారి పక్కన రథం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుదాఘాతంతో మంటలు అంటుకోవడంతో భక్తులు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని తంజావూరు మెడికల్ కాలేజీకి తరలించారు.
Source: NationalistHub