
కరాచీ: కరాచీ యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ వెలుపల వాహనం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఆత్మాహుతి దాడి అని, ఈ పని మేమే చేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది.
ఆత్మాహుతికి పాల్పడుతున్న ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో షరీ బలోచ్గా గుర్తించబడిన మహిళ… వ్యాన్ రోడ్డు మీదుగా వెళుతుండగా తనను తాను పేల్చేసుకుంది. చైనీస్ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ అధికారులను తీసుకువెళుతున్న తెల్లటి రంగు వ్యాన్.. దగ్గరికి వస్తున్న సమయంలో ఓ మలుపు దగ్గర నిలబడి ఉండి, ఈ దాడికి పాల్పడింది. చనిపోయిన వారిలో కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హువాంగ్ గైపింగ్, మరో ఇద్దరు చైనీస్ పౌరులు డింగ్ ముపెంగ్, చెన్ సా, స్థానిక డ్రైవర్ ఖలీద్ ఉన్నారు.
పాక్లో చైనా జాతీయులు దాడికి గురికావడం ఇదే మొదటిసారి కాదు. బలూచిస్తాన్కు స్వాతంత్య్రం కోరుతూ.. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతర తిరుగుబాటు కొనసాగుతూనే ఉంది. జూలై 2021లో వాయువ్య ప్రాంతంలోని దాసు వద్ద పాక్లో చైనా జాతీయులపై మొదటి భారీ దాడి జరిగింది. ఇందులో తొమ్మిది మంది చైనా జాతీయులు మరణించారు. అయితే, ఆ దాడికి బాధ్యతగా బలూచ్ మిలిటెంట్లు ఎటువంటి ప్రకటన చేయలేదు.
Source: NationalistHub





