
-
ఆంధ్రాలోని ఉత్తరాంధ్ర నుంచి గోమాతల అక్రమ రవాణా
-
యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శివ కుమార్ ఆందోళన
విశాఖపట్నం: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల సాక్షిగా లక్ష గోవులను సంరక్షిస్తానని ప్రమాణం చేశానని, తన జీవితాన్ని గోమాతకే అంకితం చేశానని, దేశం మెత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా గో హత్యలు జరుగుతున్నాయని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు శివ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

దురదృష్టవశాత్తూ ఎక్కువ సంఖ్యలో గోవులు ఆంధ్రప్రదేశ్ నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచే వస్తున్నాయని, ఈ దారుణాన్ని ఆపాలని ప్రభుత్వాలను, స్థానిక అధికారులను కోరారు.
విశాఖపట్నంలోని శ్రీ కృష్ణ విద్యామందిర్లో ఆదివారం యుగ తులసి ఉత్తరాంధ్ర గో బంధువుల ఆత్మీయ సమావేశం జరిగింది. శివ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడారు. రైతు దేశానికి వెన్నెముక అయితే గోవు రైతుకే వెన్నెముక అని గోవుని అమ్ముకోవడం కాకుండా రైతులు గోవుని నమ్ముకోవాలని శివ కుమార్ హితవు పలికారు.
ఉత్తరాంధ్రలో గో రక్షణ ఉద్యమానికి యుగ తులసి సన్నద్ధం అవుతుందని, గో బంధువులు, ప్రజల సహకారంతో ప్రతి గోవుని రక్షిస్తామని శివ కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో గో బంధువులు మండల సత్యజిత్ (సతీష్), చెన్న శ్రీను, పట్నాల సురేష్ కుమార్, మేటికోటి రవి, రావాడ నాగరాజు, పెనుమత్స కరుణాకర్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన గో బంధువులు హాజరయ్యారు.





