
ముంబై: ముస్లింలు ప్రార్థన చేసే సమయం ఆజాన్(నమాజ్)కు 15 నిమిషాల ముందు నుంచి నమాజ్ తర్వాత 15 నిమిషాల వరకు హనుమాన్ చాలీసా, భజన వంటివి లౌడ్స్పీకర్లలో ప్లే చేయకూడదని మహారాష్ట్ర పోలీసులు ఆదేశించారు. స్పీకర్లు పెట్టేందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనరేట్ ఆదేశాలు జారీ చేసింది.
మే మూడోతేదీలోపు అన్ని మతపరమైన ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు పెట్టుకునేందుకు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా స్పీకర్లు పెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలా చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.
మరోవైపు.. నమాజ్ కోసం మసీదుల్లో లౌడ్స్పీకర్లును తొలగించకపోతే.. తాము హనుమాన్ చాలీసా, భజనలతో లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే మసీదు సమీపంలో లౌడ్స్పీకర్లో హనుమాన్ చాలీసా పెట్టి నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా ఎంఎన్ఎస్ నాయకుడు మహేంద్ర భనుశాలిని అరెస్ట్ చేశారు పోలీసులు.





