News

హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు

341views

* ఇప్పుడు కాదు, హోళీ తర్వాత విచారిస్తామన్న సుప్రీం

విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు స్వీకరించింది. హోళీ శెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వ్యాజ్యాలపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు. త్వరలో పరీక్షలు ఉన్న నేపథ్యంలో.. సత్వరమే విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే, సీజేఐ ధర్మాసనం అందుకు నిరాకరించింది. శెలవుల తర్వాతే కేసును విచారణకు స్వీకరిస్తామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. దీనిపై తమకు కొంత సమయం కావాలని వ్యాఖ్యానించారు.

ఇస్లాం మతంలో.. హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారమేమీ కాదని కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చిన సంగతి పాఠకులకు విదితమే. పాఠశాలల్లో హిజాబ్ ధరించవద్దంటూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమేనని.. విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది. అయితే, ఈ తీర్పుపై మంగళవారమే కొందరు విద్యార్థినులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.