
బెంగళూరు: కొన్ని నెలలుగా కర్ణాటకలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసింది.
ఇస్లాం మతాచారం ప్రకారం.. హిజాబ్ ధరించడం తప్పనిసరేం కాదని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది జస్టిస్ రీతు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం. విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలన్న నిబంధన సహేతుకమేనని, విద్యార్థులు దీనికి అభ్యంతరం చెప్పకూడదని పేర్కొంది.
పటిష్ఠ భద్రత..
హిజాబ్పై తీర్పు నేపథ్యంలో కలబురగి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ను అమల్లోకి తెచ్చింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మార్చి 19 ఉదయం 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలను కూడా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. శివమొగ్గలోనూ స్కూళ్లు, కాలేజీలను మూసివేసినట్టు అధికారులు తెలిపారు.
Source: EtvBharat





