News

హిజాబ్‌పై అనుచిత ట్వీట్‌లతో కన్నడ నటుడు జైలుపాలు!

588views

బెంగ‌ళూరు: హిజాబ్‌ వివాదంపై అనుచితంగా ట్వీట్‌లు చేసి, కన్నడ నటుడు చేతన్‌ జైలుపాల‌య్యాడు. తన పుట్టిన రోజు కూడా జైలులోనే గడుపుకోవలసి వచ్చింది. అతను చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు.

మంగళవారం అరెస్ట్‌ చేసి లోకల్‌ మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టారు. హిజాబ్‌ పిటిషన్లపై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్‌ పైనే చేతన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతను బయటకు వస్తే మతపరమైన విద్వేషాన్ని రాజేస్తాడని, కాబట్టి.. బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాలని ప్రాసెక్యూటర్‌ అభ్యర్థించారు.

దీంతో జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన కోర్టు శుక్రవారానికి బెయిల్‌ పిటిషన్‌ పరిశీలిస్తామని తెలిపింది. అయితే, తన భర్తను అక్రమంగా అరెస్ట్‌ చేశారని చేతన్‌ భార్య మేఘ ఆరోపిస్తోంది. ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. వాళ్లను వదిలేసి, తన భర్తనే ఎందుకు అరెస్ట్‌ చేశారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.

నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా అదుపులోకి తీసుకోవడంపై మేఘ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విదేశాల్లో చదువుకుని వచ్చిన చేతన్.. డజన్కి పైగా సినిమాల్లో నటించాడు. తరచూ కన్నడ, దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు కూడా.

  • హర్ష కుటుంబ‌సభ్యులను ఓదార్చిన బీజేపీ నేతలు

శివమొగ్గలో దారుణ హత్యకు గురైన భ‌జరంగ్‌దళ్‌ కార్యకర్త హర్ష కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ నళిన్‌ కుమార్‌ కటీల్‌ ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కటీల్‌ వెంట మంత్రి ఈశ్వరప్పతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడుతూ హర్షను హత్యచేసిన గూండాలను ఇప్పటికే అరెస్టు చేశామని, ఆ కుటుంబానికి తగిన పరిహారం లభించేలా చూస్తామని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ హర్ష హత్య అనంతరం పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలకు రానున్న రోజుల్లో తగిన సమాధానం లభించనుందని చెప్పారు. స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి