
-
కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రి నారాయణ్ రాణే ఆరోపణ
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, ఆయన మేనేజర్ దిశా సాలియన్ హత్యకు గురయ్యారని, ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉందని కేంద్ర ఎంఎస్ఎంఇ మంత్రి నారాయణ్ రాణే ఆరోపించారు. సిబిఐ తనను అడిగితే దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి ప్రకటించారు.
దర్యాప్తులో ఈ హత్యల అసలు సంగతి ఎప్పుడైనా బయటపడుతుందని ఆయన అన్నారు. 2020 జూన్ 8-9 అర్ధరాత్రి ముంబై మలాడ్ ప్రాంతం గెలాక్సీ రీజెంట్ భవనం 14 వ అంతస్తు నుంచి 28 ఏళ్ల దిశా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం సుశాంత్ మృతదేహం బయటపడడానికి ఐదు రోజుల ముందే జరిగింది. 2020 జూన్ 14న బాంద్రాలోని సుశాంత్ అద్దెకు ఉంటున్న డూప్లెక్సు ఫ్లాట్లో సుశాంత్ మృతదేహం బయటపడింది.

దిశా సాలియన్ జూన్ 8న అత్యాచారానికి, తరువాత హత్యకు బలైంది. దీనిగురించి నటుడు సుశాంత్ సింగ్కు తెలుసు. నేను వారిని విడిచిపెట్టేది లేదని ఆ నటుడు చెప్పేవాడు. కానీ, నిందితులు జూన్ 13 రాత్రి సుశాంత్ సింగ్ను ఉరికి వేలాడదీశారని మంత్రి ఆరోపించారు.
దిశా సాలియన్ పోస్ట్మార్టమ్ రిపోర్టు వెల్లడి కాలేదు. కానీ, ఆ వివరాలన్నీ తనకు తెలుసని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం మారితే డాక్టర్లు ఆ వివరాలు బయటపెడతారని మంత్రి స్పష్టం చేశారు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి సిసిటివి ఫుటేజి లోని అనేక భాగాలు గల్లంతయ్యాయి. దిశాకు కాబోయే భర్త రోహన్ రాయ్ ఎక్కడ? అని రాణే ప్రశ్నించారు. అలాగే సుశాంత్ ఇంట్లో పనిచేసే సావంత్ ఎక్కడ ? అని మంత్రి ప్రశ్నించారు.
Source: Nijamtoday





