
-
టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి
తిరుపతి: తిరుమలలో అంజనాద్రిని అభివృద్ధి చేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఫిబ్రవరి 15లోగా సిద్ధం చేయాలని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం వివిధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముందుగా అంజనాద్రి కొండలు, హనుమాన్ జన్మస్థలం తదితర వాటిపై చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అంజనాద్రిపై క్షేత్రస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులను ఈఓ ఆదేశించారు.
పురాణాలు, శాస్త్రాలు, శాసనాలను పరిశీలించి పండితుల బృందం బలమైన ఆధారాలతో ఆకాశ గంగ సమీపంలో ఉన్న అంజనాద్రిని శ్రీ ఆంజనేయ స్వామి జన్మస్థలంగా ప్రకటించడాన్ని ఇక్కడ పొందుపరచాలన్నారు.
అంతకుముందు తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, తిరుమలలో నిర్మించనున్న తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరంపై వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. వెంగమాంబ ధ్యాన మందిరం స్థలాన్ని పూర్తిస్థాయిలో పర్యటించి ఫిబ్రవరి ఏడోతేదీలోపు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్ఈ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, సంస్కృత పండితుడు శ్రీ రాణి సదాశివమూర్తి, ఆర్ట్ డైరెక్టర్ శ్రీ ఆనంద సాయి, మాజీ బోర్డు సభ్యుడు శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించిన పనులపై ఫిబ్రవరి 15న సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాలని అధికారులను ఈఓ ఆదేశించారు.





