
-
భక్త జన సందోహం మధ్య వైభవంగా రథోత్సవం
-
నెల రోజుల పాటు వేడుకలు
కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో నీలకంఠేశ్వరుడి రథోత్సవం నెలరోజుల పాటు ఘనంగా జరుగుతుంది. ఆంధ్ర – కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ఇలవేల్పు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి వారు. ఏటా పుష్యమాసంలో స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. అటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు ప్రాంతాల నుంచీ ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నుంచీ వేలాది భక్తులు తరలివస్తారు. కర్నూలు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన ఎమ్మిగనూరు ఒకప్పుడు కుగ్రామం. చేనేతకళకు ప్రసిద్ధిపొందింది.
ఇక్కడి నీలకంఠేశ్వరుణ్ణి నేతకార్మికులే కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించినట్టు చెబుతారు. స్వామి స్వయంభువని మరో ఐతిహ్యం కూడా ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానాధీశులకు ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరుడు ఇష్టదైవం. వారే స్వామికి రథోత్సవ సంప్రదాయాన్ని ప్రారంభించారు. వీరప్ప అనే శిల్పి 30 అడుగుల ఎత్తుతో స్వామి రథాన్ని రూపొందించాడు. నీలకంఠేశ్వర స్వామి ఆలయం వెలసిన ప్రాంతాన్ని ఒకనాడు ఎనమలూరుగా పిలిచేవారు.
పూర్వం ఈ ఊరి సంతలో ఎనుములను భారీగా విక్రయించేవారు. ఇప్పటికీ ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పెద్ద పశువుల సంత జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు నీలకంఠేశ్వరుని సన్నిధిలో ఒక యజ్ఞం నిర్వహించాడని, చెన్నకేశవస్వామిని ప్రతిష్ఠించాడని చరిత్ర. ఇక్కడికి సమీపంలోని సంతనాగలాపురాన్ని కూడా రాయలే అభివృద్ధి పరిచాడు. ఏటా రథోత్సవానికి ముందు పుష్యపౌర్ణమినాడు(జనవరి 17) నీలకంఠేశ్వరుని కల్యాణం జరుగుతుంది.
తదియనాడు మహారథోత్సవంలో (జనవరి 19) పార్వతీపరమేశ్వరులను రథంలో కూర్చోబెట్టి తేరుబజారు వీధిలో ఘనంగా వూరేగిస్తారు. ఆ సమయానికి లక్షల మంది భక్తులు పోగవుతారు. జయజయధ్వానాలతో రథాన్ని లాగుతారు. నాటి నుంచి నెల రోజుల పాటు ఎమ్మిగనూరులో నిత్యోత్సవాలు జరుగుతాయి. జాతర కోలాహలంగా కొనసాగుతుంది.





