-
2.5 కిలోల నూనె తాగిన మహిళ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్లో రెండు రోజుల కిందట నూనె మొక్కు ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా పుష్య మాసంలో నార్నూర్లో ఈ ఉత్సవం జరుగుతుంది. ఉత్సవాన్ని పురస్కరించుకుని జరిగే ఖాందేవ్ జాతరలో తొడసం వంశీయుల ఆడపడుచులు నూనె మొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ. జాతరలో భాగంగా ఖాందేవ్ ఆలయంలో ఓ ఆదివాసీ మహిళ మంగళవారం నూనె మొక్కు చెల్లించుకుంది. తొడసం వంశీయుల సమక్షంలో మట్టిపాత్రలో 2.5 కిలోల నువ్వుల నూనెను ఒకేసారి తాగేసింది.
ఈ జాతరకు ఆదివాసీలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో మహాపూజ చేశారు. తర్వాత తొడసం వంశీయుల ఆడపడచు యోత్మభాయి నూనె మొక్కు చెల్లించుకుంది. తొడసం వంశీంలోని ప్రతిఇంటి నుంచి తీసుకొచ్చిన నువ్వుల నూనెను మట్టిపాత్రలో సేకరిస్తారు. ఆ నూనెను ఆ వంశానికి చెందిన ఆడపడచు తాగడం ఇక్కడి ఆచారం.
ఇలా నూనె సేవిస్తే ఖాందేవ్ దేవుడు తమ కుటుంబాలను, పాడిపంటలను చల్లగా చూస్తాడని వారి విశ్వాసం. ఒకసారి నూనె మొక్కును చెల్లించే ఆదివాసి మహిళ వరుసగా మూడేళ్లు ఈ మొక్కును చెల్లించాలి. ఈ జాతరకు తెలంగాణ నుంచి మాత్రమే కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు తరలిస్తారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ జాతర ఈనెల 30 వరకు జరుగుతుంది.
Source: SiteTelugu