
-
ఆ దేశం కేంద్రంగా భారత్లో ఉగ్ర చర్యలు
-
స్పష్టం చేసిన అమెరికా నిఘా వర్గాలు
వాషింగ్టన్: పాకిస్థాన్ కేంద్రంగానే ఉగ్రవాదులు భారత్ను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారని అమెరికా స్పష్టం చేసింది. వాటిపై పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. ముఖ్యంగా ముంబయి దాడుల సూత్రధారి మసూద్ అజర్, సాజిద్ మీర్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న అమెరికా.. వారు ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని వెల్లడించింది. ఉగ్రవాదానికి సంబంధించి- 2020 నివేదికను విడుదల చేసిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్.. పాకిస్థాన్ కేంద్రంగానే ఉగ్రముఠాలు పనిచేస్తున్నాయని మరోసారి ఉద్ఘాటించారు.
ఉగ్రవాదుల అణిచివేతలో భారత్ కీలక భూమిక
లష్కర్-ఏ-తోయిబాా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్, అల్-ఖైదా వంటి ఉగ్రసంస్థలను అణచివేయడంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని అమెరికా చెప్పింది. జమ్ముకశ్మీర్లో అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సర్ ఘజ్వాత్-ఉల్-హింద్కు చెందిన పలువురు కీలక ఉగ్రనేతలను భారత దళాలు అణచివేసిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. ఈశాన్య ప్రాంతంలో ముష్కరుల కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ ఉగ్ర హింస స్థాయులు తగ్గాయని చెప్పింది. దేశంలో ఖలిస్థానీ గ్రూపు ప్రాబల్యం తగ్గిందని పేర్కొంది. అయితే.. భద్రతా దళాల మధ్య ఇన్ఫర్మేషన్ షేరింగ్లో కొన్ని అంతరాలు ఉన్నాయని తెలిపింది.





