News

మత మార్పిడికి గురైన వారి ‘ఘర్ వాపస్’ కోసం ప్రతిజ్ఞ

568views
  • ఆర్‌.ఎస్.ఎస్ స‌ర్ సంఘ్‌చాల‌క్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

చిత్ర‌కూట్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చిత్రకూట్‌లో మూడు రోజుల “హిందూ ఏక్తా మహాకుంభ్”లో పాల్గొన్నవారితో ఇతర మతాలలోకి మారిన వారిని హిందూ మతంలోకి తిరిగి రావడానికి (ఘర్ వాపస్) కృషి చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ పాల్గొన్నవారెవ్వరం హిందూ మతం విడిచి, మరో మతంలోకి మారబోమని కూడా వారితో ప్రతిన చేయించారు.

ప్రతి మహిళా గౌరవాన్ని గౌరవించి, రక్షిస్తామని కూడా ప్రతివారు ప్రతిజ్ఞ చేయాలని ఈ సందర్భంగా డాక్ట‌ర్‌ భగవత్ కోరారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొంటూ ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు.

జనాభా నిరయంత్రణ, లవ్ జిహాద్ వంటి అంశాలు ఈ సదస్సులో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. “శాఖలు వేరైనా హిందువులందరూ ఒక్కటే” అనే అంశంపై ఈ మహాసభలు జరుగుతున్నాయి. హిందుత్వంపట్ల విశ్వాసం ఉన్నట్టివారు స్వార్థం లేకుండా ఐక్యత కోసం పనిచేయాలని ఈ సందర్భంగా భగవత్ పిలుపిచ్చారు.

ఈ మహాసభలను నిర్వహిస్తున్న జగద్గురు తులసి పీఠాధీశ్వర్ స్వామి భద్రాచార్య ఈ సందర్భంగా 2024 నాటికి దేశంలో ఒకే పౌరస్మృతి తీసుకు రావాలని స్పష్టం చేశారు. అధికారం కోసం ప్రజల మధ్య పనిచేయాలని, అహంకారం ఉండకూడదని భగవత్ హితవు చెప్పారు. హిందూ సోదరీమణుల నిరాడంబరతను, గౌరవాన్ని కాపాడుతామని, కుల, భాషల విభజనలను అధిగమించడం ద్వారా హిందూ సమాజాన్ని బలోపేతం చేస్తామని కూడా ప్రతిజ్ఞ చేశారు.

ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌, హిందుత్వ నాయకురాలు సాధ్వి రితంబర, ప్రముఖ్ కవి కుమార్ విశ్వాస్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారి, బాలీవుడ్ నటుడు అశుతోష్ రానా తదితరులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరయ్యారు.

రాముడి సంకల్పస్థలి (నిర్ణయ స్థలం) నుండి, హిందూ సంస్కృతికి చెందిన ధర్మ యోధాలు జీవితాంతం పవిత్రమైన హిందూ మతం, సంస్కృతి, సమాజం రక్షణ, ప్రచారం, భద్రత కోసం పని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత తెలిపారు. ధర్మాన్ని ఆచరిస్తూ, అహంకారం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూనే అతి కష్టమైన పనుల్లో కూడా విజయం సాధిస్తారని భగవత్ చెప్పారు.

రాముడి ఆశయాలను పాటించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత, జనాభా పెరుగుదలను తగ్గించడంపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ఇతరులు ఐక్యమయితే ఉగ్రవాదం పెరుగుతుందని, కానీ హిందువులు ఐక్యమయితే దేశం శక్తివంతం అవుతుందని ఆయన చెప్పారు. మత మార్పిడులు, లవ్ జిహాదీ వంటి 12 అంశాలపై పోరాడాలని మహాసభల సంకల్పానికి ఆయన మద్దతు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి