
-
తృణమూల్కు రెండోస్థానం
-
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
త్రిపుర: త్రిపురలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజయం దిశగా దూసుకుపోతోంది. దీంతో పశ్చిమ బెంగాల్తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఈ ఎన్నికలతో రాష్ట్రంలో తమ ఉనికి చాటుకుంటామని భావించిన తృణమూల్ కాంగ్రెస్ ఆశలకు ఈ ఎన్నికల ఫలితాలు గండి కొట్టాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
14 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇతర పార్టీలను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. కాగా, మిగిలిన స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. త్రిపురలో మొత్తం 20 మునిసిపాలిటీలకు 14 స్థానాల్లో గురువారం ఓటింగ్ జరిగింది. బీజేపీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తం 334 వార్డులకు బీజేపీ ఇప్పటికే 112 స్థానాల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 222 స్థానాలకు ఓటింగ్ జరిగింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా సమాచారం ప్రకారం అంబాసా, జిరానియా, తెలియమురా, సబ్రూమ్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ త్రిపురలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అగర్తల మున్సిపల్ కార్పొరేషన్లోని అన్ని వార్డులలో తృణమూల్ కాంగ్రెస్ రెండో స్థానాన్ని పొందినట్లు ట్రెండ్లు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఎంసీ ఏరియాల్లో బీజేపీకి 58,821 ఓట్లు రాగా, టీఎంసీకి 22,295 ఓట్లు వచ్చాయి. సీపీఐ(ఎం) 15,960 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Source: Tv9





