
విశాఖపట్నం: విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకా సర్వీసులు ప్రారంభించే దిశగా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. విశాఖ నౌకాశ్రయంలో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఏడాదిలో పనులు పూర్తి చేయాలి. ఆలోపు విశాఖ నగరానికి అంతర్జాతీయ విహార నౌకలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ముంబయి, కొచ్చి, గోవా, మంగళూరు, చెన్నై తదితర నౌకాశ్రయాలకు అంతర్జాతీయ విహార నౌకలు వస్తుంటాయి.
ఆయా సర్వీసులు నడిపే సంస్థల ప్రతినిధులతో మాట్లాడి విశాఖకు కూడా విదేశీ పర్యాటకులు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి వీలుగా సర్వీసులు ఉండేలా షిప్పింగ్ ఏజెంట్లు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ విహార నౌకల్లో రెస్టారెంట్లు, ఈత కొలను, థియేటర్లు, డాన్స్ ఫ్లోర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో రెండు వేల మంది వరకు ప్రయాణించవచ్చు.





