
వడోదరా: గోద్రా రైలు దహనం కేసు దోషుల్లో ఒకడైన బిలాల్ ఇస్మాయిల్ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. అతని ఆరోగ్య విషమించటంతో ఈ నెల 22న నగరంలోని ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.
గుజరాత్ గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం కేసులో దోషి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో దోషిగా తేలిన బిలాల్ ఇస్మాయిల్ అలియాస్ హాజి బిలాల్(61) గుజరాత్, వడోదరాలోని కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడని, ఇటీవల అనారోగ్యానికి గురైన క్రమంలో నగరంలోని ఆసుపత్రిలో చేర్పించినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవీ రాజ్గోర్ తెలిపారు. నాలుగేళ్ల నుంచి బిలాల్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందన్నారు రాజ్గోర్. ఆరోగ్యం విషమించటం వల్ల 22న జైలు నుంచి వడోదరాలోని ఎస్ఎస్జీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
ఆ ఘటనలో 59 మంది దుర్మణం!
2002, ఫిబ్రవరి 27న గోద్రాలో కరసేవకులను తరలిస్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్లోని ఎస్6 బోగీని దహనం చేసిన కేసులో జీవిత ఖైదు పడిన 11 మందిలో బిలాల్ ఒకడు. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. బిలాల్ సహా మరో 10 మందికి ముందుగా 2011లో మరణ శిక్ష విధించింది సిట్ కోర్టు. 2017 అక్టోబర్లో మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది గుజరాత్ హైకోర్టు.
గోద్రా రైలు దహనంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. గుజరాత్ వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పలు నివేదికలు తెలిపాయి.
Source: EtvBharat





