
-
పాఠశాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
-
పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ
చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా రామేశ్వరం, మదురై సహా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో గురువారం 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూత్తుకుడి, తిరునల్వేలి, రామనాథపురం, పుడుకొట్టాయ్, నాగపట్టణం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కన్యాకుమారి, తిరునల్వేలి, టెన్కాశీ, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో సాధారణ వర్షం కురుస్తుందని వెల్లడించింది. కావేరీ డెల్టా సహా 15కు పైగా జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు ముంచెత్తవచ్చని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో తూత్తుకుడి, దిండిగల్, థేని, పెరంబలూర్, తంజావూర్, టెన్కాశీ, తిరునల్వేలి సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు శుక్రవారం సెలవులు ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు లేకపోవడంతో ప్రభుత్వం సెలవుల్ని పొడిగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.





