
-
సిద్ధు వ్యాఖ్యలపై గంభీర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పిల్లల్ని సరిహద్దులకు పంపాలని మాజీ ఓపెనర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను సిద్ధూ తన పెద్దన్నగా సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్లోని కర్తార్పూర్ సాహిబ్ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధూ… భారత్, పాక్ ప్రధానులు మోదీ, ఇమ్రాన్ఖాన్ చొరవ వల్లే కర్తార్పుర్ నడవా తిరిగి తెరుచుకుందని, పంజాబ్ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వాణిజ్య కార్యకలాపాల కోసం రెండు దేశాల సరిహద్దులను తిరిగి తెరవాలని కోరారు. పంజాబ్ నుంచి పాకిస్థాన్కు 21 కిలోమీటర్ల దూరమే ఉన్నప్పుడు ముంద్రా పోర్టు మీదుగా 2,100 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ఖాన్ తనకు పెద్దన్నయ్య లాంటి వారని సంబోధించారు. దీంతో దుమారం రేగుతోంది. భారతీయ జనతా పార్టీ నేతలు సిద్ధూ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





