
-
కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటిపై ‘నిప్పులు’
డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నివాసంపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో సల్మాన్ ఖుర్షీద్ నివాసంపై కొంతమంది దాడి చేసి, నిప్పుపెట్టారు. రాళ్లు విసిరారు. అయోధ్యపై సల్మాన్ ఖుర్షీద్ రాసిన ‘సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ అనే పుస్తకంపై వివాదం చెలరేగుతోంది. ప్రస్తుతం ఉన్న హిందుత్వకు గతంలో ఉన్న హిందుత్వకు చాలా తేడా ఉందన్నారు సల్మాన్ ఖుర్షీద్. ఐసిస్, బోకో హరామ్ వంటి ఇస్లామిక్ జిహాదీ గ్రూపులకు ఇప్పటి హిందుత్వకు తేడా లేదని తన పుస్తకంలో పేర్కొన్నారు.
సల్మాన్ ఖుర్షీద్ పుస్తకంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుస్తకం దేశంలో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తోందని మండిపడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖుర్షీద్ను కాంగ్రెస్ పార్టీ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
నిషేధించాలని షాకు లేఖ
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అయోధ్యపై సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకాన్ని బ్యాన్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు లేఖ రాశారు. అయితే, అయోధ్యపై తన పుస్తకాన్ని మరోసారి సమర్ధించారు సల్మాన్ ఖుర్షీద్. తాజా పరిస్థితులనే తన పుస్తకంలో ప్రస్తావించినట్టు స్పష్టం చేశారు.
Source: Tv9





