
-
పాక్కు భారత రహస్య సమాచారం అందజేత
-
ఉగ్రవాద నిరోధక దళం అదుపులో నిందితుడు
గాంధీనగర్: గుజరాత్ భుజ్ బెటాలియన్కు చెందిన సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. పాకిస్థాన్కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్ సజ్జద్గా అధికారులు గుర్తించారు. భుజ్లోని బీఎస్ఎఫ్ 74వ బెటాలియన్లో ఈ ఏడాది జులైలో అతడు నియమితుడయ్యాడని చెప్పారు.
వాట్సాప్ ద్వారా రహస్య సమాచారాన్ని సజ్జద్.. పాక్కు చేరవేశాడని ఏటీఎస్ తెలిపింది. అంతేగాకుండా తప్పుడు జన్మ ధ్రువీకరణ పత్రం సమర్పించి బీఎస్ఎఫ్ను తప్పుదోవ పట్టించాడని పేర్కొంది. ఆధార్ కార్డు ప్రకారం సజ్జద్ 1992 జనవరి 1న జన్మించినట్టు ఉండగా.. పాస్పోర్టు ప్రకారం అతడు 1985 జనవరి 30న పుట్టినట్లుగా ఉందని పేర్కొంది. సజ్జద్ వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, వాటి సిమ్కార్డులతో పాటు, మరో రెండు సిమ్కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.