News

పాక్‌-ఇండియా మ్యాచ్‌పై పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

744views
  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

ఇస్లామాబాద్‌: టీ20 వరల్డ్‌ కప్‌లో దాయాది దేశాల మధ్య రాత్రి జరిగిన రసవత్తర పోరులో ఇండియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రీడను క్రీడలా చూడకుండా భారత్‌పై ఉన్న తమ అక్కసును మరోసారి వెళ్లగక్కారు. భారతదేశంపై పాక్‌ సాధించిన విజయాన్ని ఇస్లాం విజయం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

పాకిస్తాన్‌కు చెందిన మినిస్టర్‌ షెయ్‌ రషీద్‌ అహ్మద్‌ టీమిండియాపై పాక్‌ విజయం అనంతరం స్పందించారు. ‘ఇండియా-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక వర్గం ప్రజలు పాకిస్తాన్‌కే మద్దతు తెలిపారు. మేమే గెలవాలని కోరుకున్నారు. పాకిస్తాన్‌ వరకు నిన్న జరిగిన మ్యాచ్‌ ఫైనల్‌తో సమానం. ఇది పాక్‌ విజయం కాదు.. ఇస్లాం విజయం’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజం ఇద్దరే వారి జట్టుకు విజయం సాధించిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అభిమానులకు భారీ నిరాశ మిగిల్చింది.