
ఐక్యరాజ్యసమితి: కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 100 కోట్ల డోసులను పంపిణీ చేసి మరో ఘనతను సాధించింది. గురువారం నాటికి భారత్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ సంఖ్య 100 కోట్లు దాటింది. అయితే.. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సాధించిన ఈ ఘనతను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. 100కోట్ల డోసులను పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఉన్న ప్రజలను రక్షించడంతోపాటు వ్యాక్సిన్ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు మీరు చేస్తోన్న ప్రయత్నాలకు అభినందనలు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శాస్త్రవేత్తలు, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్ పేర్కొన్నారు. 100కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్కు టెడ్రోస్ స్పందిస్తూ రీట్విట్ చేశారు. ‘100 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి మరో మైలురాయిని సాధించినందకు భారత్కు అభినందనలు’ అంటూ పేర్కొన్నారు.
Source: Tv9





