
న్యూఢిల్లీ: 2016.. ‘పనామా పేపర్స్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎంతో మందికి సంబంధించిన రహస్య ఆర్ధిక లావాదేవీలను బయటపెట్టారు. తాజాగా ‘పండోరా పేపర్స్’ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) బహిర్గతం చేసింది.
ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల పేర్లతో పాటు దేశంలోని ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 150 మీడియా సంస్థలు, 6 వందలమంది జర్నలిస్టులతో సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ వివరాల్ని వెలువరించింది ఐసీఐజే సంస్థ. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించి 12 మిలియన్ల పత్రాల్ని సేకరించినట్టు సంస్థ తెలిపింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో బ్లాక్మనీని దాచుకునేందుకు, రహస్యంగా ఆస్థుల్ని కూడబెట్టేందుకు డొల్ల కంపెనీలకు సృష్టించారని ఐసీఐజే వెల్లడించింది.
అమెరికా, ఇండియా, పాకిస్తాన్, బ్రిటన్, మెక్సికో తదితర దేశాలకు చెందిన సంపన్నులు, రాజకీయ నేతలు ఈ చిట్టాలో ఉన్నారు. చాలామంది సంపన్నుల రహస్య వ్యవహారాలు తమ దగ్గర ఉన్నాయని.. వాటిన్నంటినీ బహిర్గతం చేస్తామని ఐసీఐజే పేర్కొంది.
భారత్ నుంచి 3 వందల పేర్లు…
రహస్య ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పండోరా పేపర్స్ లో భారత్ నుంచి మూడు వందల పేర్లున్నాయి. భారత్ నుంచి ఆరుగురు, పాకిస్తాన్ నుంచి ఏడుగురు రాజకీయ నేతల పేర్లున్నాయి. ఈ పేపర్ల ద్వారా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అడ్డంగా దొరికిపోయారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేకపోయినా.. ఆయన సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయని పండోరా పేపర్స్లో తెలిపారు.
పండోరా పేపర్స్ 2021 జాబితాలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు కూడా వచ్చింది. అయితే, ఐసీఐజే నివేదిక సచిన్కు క్లీన్చిట్ ఇచ్చింది. సచిన్ విదేశీ పెట్టుబడులన్నీ సక్రమమేనని, ఇన్కంటాక్స్ అధికారులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించినట్టు పండోరా పేపర్స్ నివేదిక స్పష్టం చేసింది. పండోరా పేపర్స్ నివేదికలోని వివరాలు కేవలం ఆరోపణలు మాత్రమే. దర్యాప్తు చేయించడం లేదా వదిలేయడమనేది ఆయా ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Source: NationalistHub





