News

‘జల్‌ జీవన్‌ మిషన్‌’లో 5 కోట్ల కుళాయి కనెక్షన్లు

498views

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో 70 ఏళ్లలో 3 కోట్ల నీటి కుళాయిల కనెక్షన్లు ఇవ్వగా జల్‌ జీవన్‌ మిషన్‌ స్థాపించిన రెండేళ్లలోనే 5 కోట్ల కనెక్షన్లను ఇచ్చామని మోదీ చెప్పుకొచ్చారు. 2019లో జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రారంభించినప్పటి నుండి, ఐదు కోట్ల కుటుంబాలకు నీటి కనెక్షన్‌ లభించిందని అన్నారు. ఇప్పుడు దాదాపు 1.25 లక్షల గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి నీరు చేరుతోందని చెప్పారు. ఏడు దశాబ్దాల్లో ఇచ్చిన కనెక్షన్ల కంటే.. గత రెండేళ్లలో ఇచ్చిన కనెక్షన్లే ఎక్కువ అని మోదీ తెలిపారు.

రాష్ట్రీయ జల్‌ జీవన్‌ కోశ్‌ అండ్‌ జల్‌ జీవన్‌ మిషన్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను మోదీ ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ అనేది పూర్తిగా గ్రామాలు నడిపించే, గ్రామాల్లోని మహిళలు నడిపించే ఉద్యమం అని వ్యాఖ్యానించారు. మాస్‌ మూవ్‌మెంట్‌, పబ్లిక్‌ పార్టిసిపేషనే దీనికి ప్రధాన ఆధారమని చెప్పారు. జల్‌జీవన్‌ మిషన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ఉద్యమానికి సంబంధించిన సమస్త సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంటుందన్నారు.

జల్‌ జీవన్‌ మిషన్‌ ఉద్దేశం కేవలం ప్రజలకు నీటి సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదని, ఇదొక పెద్ద వికేంద్రీకరణ ఉద్యమమని ఆయన చెప్పారు. ఈ మిషన్‌ క్రింద స్కీముల్లో జవాబుదారీతనం, పారదర్శకత తేవడం, సంబంధితులందరికీ అవగాహన కల్పించడమని అన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ మహిళల సమయాన్ని ఆదా చేయడంతోపాటు వారిని సాధికారులను చేస్తోందని అన్నారు. గతంలో మంచినీటిని తేవడం కోసం మహిళలు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వచ్చేదన్నారు. ఆ సమయం, శ్రమ జల్‌ జీవన్‌ మిషన్‌ వల్ల ఆదా అవుతున్నాయన్నారు.

ప్రధాని మోదీ వివిధ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లతో మాట్లాడారు. గ్రామీణ నీరు, పారిశుద్ధ్యం కమిటీల ప్రతినిధులతో కూడా మాట్లాడారు. జల్‌ జీవన్‌ మిషన్‌ వల్ల తమ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి పరిశుభ్రమైన మంచినీటి కొళాయి ద్వారా లభిస్తోందని సర్పంచ్‌లు, కమిటీల ప్రతినిధులు చెప్పారు.

ప్రజలకు మంచినీటిని అందించడంలో గత కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై కూడా మోదీ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో స్విమ్మింగ్‌ పూల్స్‌లో నీళ్లు ఉంటే.. దేశం మొత్తం నీళ్లు ఉందని అనుకునేవారని మోదీ వ్యాఖ్యలు చేశారు. వారు పేదరికాన్ని చూడలేదు.. అది వారికి ఒక ఆకర్షణ మాత్రమే. ఒక ఆదర్శ గ్రామం కోసం ప్రయత్నించాలి కానీ వారు గ్రామాల్లోని లోపాలను ఇష్టపడుతూనే వచ్చారని ప్రధాని మోదీ అన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి