
-
షాంగై సహకార సదస్సులో ఉన్నతాధికారులతో భారత ప్రతినిధి భేటీ
న్యూఢిల్లీ: చైనా మంకుపట్టు వీడింది. భారత్తో తన సంబంధాలను మూడో దేశం కోణం నుంచి చైనా చూడకూడదని విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలతో చైనా ఏకీభవించింది. భారత్, చైనా సంబంధాలు ఇరు దేశాల అంతర్గత విషయాలు అని స్పష్టం చేసింది. తజికిస్థాన్ రాజధాని దుషన్బే వేదికగా జరగుతున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన జైశంకర్.. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు.
తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న మిగతా సమస్యలను ఇరు దేశాలు త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ గుర్తుచేశారు. పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలను ఏర్పరచుకోవాల్సి ఉందని అన్నారు. అది మూడో దేశం కోణం నుంచి ఉండకుండా చూడాలని సూచించారు. జైశంకర్ వ్యాఖ్యలపై బీజింగ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందించారు. భారత్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.





