
సింహాచలం: ఏపీలోని విశాఖపట్నం జిల్లా, సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలోని నారసింహావతార శిల్పాలు భక్తుల మనసు దోచుకుంటున్నాయి. ప్రహ్లాదుడి రక్షణార్థం ఇలకు దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించే సమయంలో అనేక రూపాలు దాల్చాడని ప్రతీతి. హిరణ్యకశిపుడి సంహారం అనంతరం ప్రహ్లాదుడి కోరిక మేరకు హిరణ్యాక్షుడిని సంహరించిన వరహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నారసింహావతారాల కలయికతో వరాహ నారసింహుడిగా, యుగళావతారమూర్తిగా ఇక్కడ కొలువుతీరాడని క్షేత్ర మహాత్మ్యం చెబుతుంది.

లోకంలో ఎన్నో వరాహ క్షేత్రాలు, మరెన్నో నారసింహక్షేత్రాలు ఉన్నప్పటికీ వరాహనారసింహ అవతరాల కలయికతో శ్రీ మహావిష్ణువు కొలువున్న ఏకైక దివ్యక్షేత్రం సింహాచలమే. ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. అందులో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న 32 నారసింహావతారాలు దేవాలయం బేడా మండపంలోని ఏకశిల స్తంభాలపై శిల్పాలుగా ఉన్నాయి. నారసింహవతార శిల్పాలు ఇక్కడున్నాయన్న విషయం చాలామందికి తెలియదు.
ఈ నేపథ్యంలో ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.వి. సూర్యకళ క్షేత్ర మహాత్మ్యాన్ని, చరిత్రను గ్రంథాల ద్వారా తెలుసుకుని నారసింహ అవతార శిల్పాలు భక్తులకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు దేవాలయ వైదిక పెద్దలు, అధికారులతో చర్చించి శిల్పాలకు మెరుగులు దిద్దించారు. అవతారాల నామాలతో బోర్డులు ఏర్పాటు చేయించారు. బేడా ప్రదక్షిణ చేసే ప్రముఖులతో పాటు భక్తులకు కూడా ఈ అవతారాలు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి.





