
ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టును ప్రధాని నరేంద్రమోడీ అభినందించారు. మ్యాచ్ గెలిచిన వెంటనే ఆయన కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహం రీడ్ కు ఫోన్ చేశారు. ‘చరిత్ర లిఖించారు’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. దేశం మీ రాక కోసం ఎదురు చూస్తోందని ప్రశంసించారు. బెల్జియంతో జరిగిన సెమీస్ ను ప్రధాని మోడీ టీవీలో వీక్షించారు. ఆ మ్యాచులో టీమ్ఇండియా పోరాడి ఓడింది. బాధలో ఉన్న మన్ ప్రీత్ సేనను ఆయన ఓదార్చారు. ఫోన్ చేసి గెలుపోటములు సహజమేనని అన్నారు. జట్టు పోరాటాన్ని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు.తర్వాతి మ్యాచులో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టే హాకీ ఇండియా జర్మనీని 5-4 తేడాతో ఓడించింది.

విజయం సాధించిన వెంటనే ‘చరిత్రాత్మకం! ఈ రోజు ప్రతి భారతీయుడి మదిలో ఉండిపోతుంది. ఇంటికి కాంస్యం తీసుకొస్తున్న భారత హాకీ జట్టుకు అభినందనలు. ఈ అద్భుత విజయంతో వారు యావత్ భారతావని, ముఖ్యంగా యువత కలలను నిజం చేశారు. హాకీ జట్టును చూసి భారత్ గర్విస్తోంది’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. వెంటనే మన్ ప్రీత్ కు కాల్ చేశారు. ‘మన్ ప్రీత్ జీ! మీకు అభినందనలు. మీరు, మొత్తం జట్టు గొప్ప విజయం సాధించారు. మీరు సాధించిన విజయం చూసిన యావత్ భారతావని ఆనంద తాండవం చేస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఆటగాళ్లందరికీ అభినందనలు. మీరు రాగానే మనమంతా కలుద్దాం. కోచ్ గ్రాహం రీడ్ తోనూ ఆయన మాట్లాడారు.
మనం చరిత్ర సృష్టించాం’ అని మోదీ అనడంతో ‘సెమీస్ తర్వాత మీ మాటలు మాకు ప్రేరణనిచ్చాయి. మేమంతా ఆ మాటలతో స్ఫూర్తి పొందాం. ధన్యవాదాలు’ అని రీడ్ బదులిచ్చారు. దాంతో ‘మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. నేనెంతో గర్వపడుతున్నాను’ అని ప్రధాని సంభాషణను ముగించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





