
భారత్లో కరోనా మూడో దశ తథ్యమని.. అది పిల్లలపై అధిక ప్రభావం చూపబోతోందన్న నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో యూపీ సర్కారు ముందస్తు చర్యలకు చేపట్టింది. రాష్ట్రంలోని పిల్లల కోసం ప్రత్యేక వైద్య కిట్లను తయారుచేసేందుకు సిద్ధమైంది. వీటిలో సిరప్లతో పాటు మాత్రలను అందించనున్నారు.
ఈ కిట్లను జూన్ 15 నుంచి పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు యూపీ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ వెల్లడించారు. పిల్లల వయసు, బరువు ప్రకారం మెడికల్ కిట్లలో మార్పులు చేసి పంపిణీ చేస్తామన్నారు. ’97 వేల మంది ఆరోగ్య సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి.. పిల్లల సమాచారాన్ని సేకరిస్తున్నారు. 30 లక్షల కిట్లను రాష్ట్రం సిద్ధం చేస్తోంది. దగ్గు, జలుబు ఉన్న పిల్లలకు వారం రోజులపాటు ఈ మెడిసిన్ను వేయాలని తల్లిదండ్రులకు తెలియజేస్తాం’ అని పేర్కొన్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు ఒక రకమైన కిట్, 6-12 ఏళ్ల లోపు వారికి ఇంకో రకం, 12-18 సంవత్సరాల వారికి మరో రకం.. ఇలా మూడు రకాల మెడికల్ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.





