
దేశవ్యాప్తంగా కొవిడ్-19 రెండోదశ తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు కూడా పెరిగిపోయాయి. మరోవైపు బ్లాక్ మార్కెట్ పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కొవిడ్-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ సిఫారసు చేస్తున్నారు. ఇప్పటికే రెమ్డెసివిర్ కొరత ఏర్పడగా, బయట మార్కెట్లో దీన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలను తగ్గించాలని ప్రభుత్వం, నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్ఏపీపీఏ) ఫార్మా కంపెనీలను కోరగా, అందుకు ఆయా కంపెనీలు అంగీకరించాయి.
క్యాడిల్లా హెల్త్కేర్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సిప్లా బ్రాండ్లు రెమ్డెసివర్ ఇంజక్షన్(100mg/vial) ధరను తగ్గించాయి. ‘ప్రభుత్వ జోక్యంతో రెమ్డెసివర్ ఇంజక్షన్ ధరను ఫార్మా కంపెనీలు తగ్గించాయి. కరోనాపై పోరాటంలో ప్రభుత్వంతో చేతులు కలిపి తమవంతు సాయం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు” అని కేంద్ర మంత్రి ముఖేశ్ ఎల్ మాండవీయ ట్వీట్ చేశారు.





