
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. మత ప్రాతిపదికన ఓట్లు అడగడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు రావడంతో దీనిపై 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 3వ తేదీన హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్ ప్రాంతంలో మమతా బెనర్జీ పర్యటించారు. ఆ సమయంలో ముస్లిం ఓటర్లను ఆమె ప్రస్తావిస్తూ….. కొన్ని పార్టీలు మైనారిటీ ఓటర్లను విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి సమయంలో మైనారిటీ ఓటర్లందరూ ఏకం కావాలని మమత పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీనిపై కేంద్రమంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ నేతృత్వంలోని భాజపా బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. 48గంటల్లో వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి నోటీసులు జారీచేసింది.





