
కరోనా వైరస్ ను ఎదుర్కొనే ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)తో కేరళ కొట్టక్కల్లోని ఆర్య వైద్యశాల(ఏవీఎస్) ఒప్పందం చేసుకుంది. ఆర్య వైద్యశాల 118 సంవత్సరాల పురాతన స్వచ్ఛంద సంస్థ. ఆయుర్వేద చికిత్సతోపాటు ప్రచారంలో నిమగ్నమై ఉంది. ఈ సంస్థ 500కుపైగా ఆయుర్వేద ప్రామాణిక సూత్రీకరణలను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. వీటిలో కొన్ని ఫార్ములాలు కొవిడ్ వైరస్ ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ఏవీఎస్ ప్రాథమికంగా గుర్తించింది. వాటిని సీసీఎంబీ ప్రయోగశాలలో పెంచిన కరోనా వైరస్ పై ప్రయోగించి యాంటీ వైరల్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇది స్పష్టమైన ఫలితాలను ఇస్తే ఈ పరిశోధనలు భారత్ లోని ఔషధ పరిశ్రమలో కీలక పురోగతికి దారి తీస్తుంది. భారత్ చాలా పురాతన విజ్ఞానాన్ని కలిగి ఉన్నా… పురాతన గ్రంథాలపై ఆధారపడిన ఆయుర్వేద ఫార్ములాల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇప్పటివరకు సరియైన విధివిధానాలు లేవు. ఇప్పటివరకూ మన ప్రభుత్వాలేవీ ఆ దిశగా ప్రయత్నించనే లేదు. ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
కరోనా వైరస్ పై పనిచేసే ఔషధాలను ప్రజలకు ఇచ్చే ముందు పలు చికిత్సా అవకాశాలను కఠినంగా పరీక్షించడం అత్యవసరం. అప్పుడే వీటికి శాస్త్రీయత ఉంటుంది. తమ ప్రయోగశాలకు వృద్ధి చేసిన కరోనా వైరస్ పై ఔషధాలు పనిచేస్తాయో లేదో పరీక్షించే సామర్థ్యం ఉందని.. ఆయుర్వేద ఫార్ములాల్లోని యాంటీవైరల్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర అన్నారు.
ఆధునిక సైన్స్ తో ఆయుర్వేద శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ధ్రువీకరించే ప్రయత్నంలో సీసీఎంబీతో చేతులు కలిపామని ఏవీఎస్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సి.టి.సులెమాన్ అన్నారు. ఎంపిక చేసిన ఫార్ములాల రసాయన మూల్యాంకనం శక్తివంతమైన అణువుల ఉనికి చూపించిందని.. తాజా ఒప్పందంతో మరింత లోతుగా పరిశోధనకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో హిమాలయాల్లో పండించే పుట్టగొడుగులో యాంటీవైరల్ గుణాలు ఉన్నట్లు సీసీఎంబీ నిర్ధారించిన సంగతి తెలిసిందే.