
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో చైనా నిజాలు దాచిపెట్టిందని అదే దేశానికి చెందిన వైరాలజిస్టు డాక్టర్ లి మెగ్ యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాంగ్కాంగ్లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పని చేస్తున్న ఆమె కరోనా వైరస్పై పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆమె పలు విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
‘నేను న్యుమోనియాపై పరిశోధనలు చేసే సమయంలోనే ఈ ప్రాణాంతక కరోనా వైరస్ వుహాన్లోని ఓ ల్యాబ్లో తయారైనట్లు గుర్తించాను. ఆ ల్యాబ్ పూర్తిగా చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. వైరస్కు సంబంధించి నేను హెచ్చరికలు చేసినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాదకరమైన వైరస్ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయాల్సింది పోయి నా హెచ్చరికలను సైతం నిర్లక్ష్యం చేశారు. ఈ వైరస్ ప్రకృతి నుంచి సహజసిద్ధంగా పుట్టింది కాదు. అది వుహాన్లోనే పుట్టిందనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి.
వైరస్ విషయంలో గొంతు ఎత్తినందుకు నాపై చైనా అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారు. చైనాలో నాపై దుష్ప్రచారం చేయడంతో పాటు నా సమాచారం మొత్తం డిలీట్ చేశారు. ఆ తర్వాత నేను ఆమెరికాకు వెళ్లిపోవాల్సి వచ్చింది’ అని యాన్ ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వుహాన్లోని వైరాలజీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ యువాన్ జిమింగ్ మాత్రం ఆమె ఆరోపణలు కొట్టిపారేశారు. చైనా అధికారులు సైతం ఈ వీడియోపై ఇంత వరకూ స్పందించకపోవడం గమనార్హం.





