
ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంమైన దంతెవాడలో తొమ్మిది మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. జిల్లా రిజర్వ్ గార్డ్, జిల్లా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపులో వీరు చిక్కినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ఆదివారం తెలిపారు. మలివాడ, మోఖ్పల్ గ్రామాల మధ్య శనివారం పెట్రోలింగ్ సిబ్బందిని చూసి వీరు పారిపోతుండగా పట్టుకున్నట్లు చెప్పారు.
వీరంతా మావోయిస్టు పార్టీలో దిగువ స్థాయి కేడర్ అని ఎస్పీ తెలిపారు. మావోయిస్టు పార్టీ విభాగాలైన జన్మిలిషియా, దండకారణ్యం ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్కు చెందిన వారిగా గుర్తించామన్నారు. మావోయిస్టులకు సంబంధించిన పోస్టర్లను అతికించడం, భద్రతా సిబ్బంది అడుగులను ఎప్పటికప్పుడు సీనియర్ కేడర్కు చేరవేయడం వీరి పని అని చెప్పారు. వీరిపై ఛత్తీస్గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 2005 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.





