
638views
ప్రకృతిలో భాగమైన చెట్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ కొందరు యువకులు ఓ వృక్షానికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రావి చెట్టుకు నలభై ఏళ్లు నిండిన సందర్భంగా కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. తమిళనాడు కోయంబత్తూర్లోని పులియాకులం కురుపారాయణ్ కోయిల్ వీధిలో చాలా ఏళ్ల క్రితం ఓ రావి మొక్కను నాటారు. కొద్ది కాలం తర్వాత సరైన పోషణ లేక అది వాడిపోయింది. గమనించిన స్థానికులు.. అప్పటి నుంచి దానికి తరచూ నీరు పోయడం అలవాటు చేసుకున్నారు. ఇలా ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఆ చెట్టుకు నలభై ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆ వృక్షానికి జన్మదిన వేడుకలు నిర్వహించారు. చెట్టు కింద వినాయక విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు. ఇకపై ఏటా ఇలాంటి వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించారు.





