
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 2వ తేదీన అమిత్షాకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు. కొవిడ్ నుంచి కోలుకున్న కొన్నిరోజులకే అలసట, ఒళ్లు నొప్పుల సమస్యలతో ఆగస్టు 18న ఎయిమ్స్లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో సోమవారం ఉదయం డిశ్చార్జి చేసినట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. తాజాగా, ఓనమ్ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్షా ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే, భారత్లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 36లక్షలు దాటింది. వీరిలో ఇప్పటికే 27లక్షల మంది కోలుకున్నారు. ఇక మరణాల సంఖ్య 64వేలు దాటడం ఆందోళన కలిగించే విషయం.





