
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిరంలో రెండు వేల అడుగుల లోతున ఓ కాలనాళిక (టైమ్ క్యాప్సూల్)ను ఉంచనున్నారు. దీనిలో సం బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సారథ్యం వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మందిరానికి సంబంధించిన చరిత్రను, వివరాలను తెలుసుకోవాలనుకునే రాబోయే తరాల వారికి ఈ ఏర్పాటు ప్రయోజనకరం కాగలదని ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ అన్నారు. భూగర్భంలో నిక్షిప్తం చేసే ముందు కాలనాళికను ఓ రాగిరేకు లోపల భద్రపరుస్తారని 64 ఏళ్ల చౌపాల్ వివరించారు.
రామ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో రామ మందిర నిర్మాణానికి అనుమతినిస్తూ సర్వోన్నత న్యాయస్థానం గత సంవత్సరం నవంబర్ 9న తీర్పు వెలువరించింది. అంతేకాకుండా మసీదు నిర్మాణానికి అనువైన ఐదు ఎకరాల స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు కేటాయించాల్సిందిగా ఈ తీర్పులో పేర్కొంది. కాగా, ఈ చారిత్రాత్మిక కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తొమ్మిది నెలల అనంతరం.. తొలిసారిగా ఆగస్టు 5న నిర్వహించనున్న భూమి పూజకు ప్రధాని మోదీ హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 3న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుంది. మందిర నిర్మాణ స్థలంలో ఆలయ గర్భగుడి వద్ద జరిగే భూమిపూజ కార్యక్రమంలో నలభై కిలోల వెండి ఇటుకను ఉపయోగించనున్నారు. ఇక ఆగస్టు 5న జరుగనున్న ఈ కార్యక్రమం దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.





