
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) సరిహద్దు ప్రాంతాలలో పర్యవేక్షణ, సమస్యాత్మక భూభాగాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మానవరహిత వైమానిక వాహనాన్ని (డ్రోన్) అభివృద్ధి చేసింది. తూర్పు లడఖ్లో చైనాతో స్టాండ్-ఆఫ్ కొనసాగుతున్నందున, తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసి) వెంట ఆర్మీ యూనిట్లతో కలిపి ఈ డ్రోన్ ను కూడా మోహరించాలని భావిస్తున్నారు.
‘భరత్’ అని నామకరణం చేసిన ఈ డ్రోన్ను DRDO యొక్క టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL) అభివృద్ధి చేసింది. COVID-19 ముప్పును తగ్గించడానికి వివిధ సాంకేతిక పరికరాలను కూడా TBRL రూపొందించి ఉంది.
“ఈ డ్రోన్ దాని ఆపరేటర్లకు రియల్ టైమ్ వీడియో ఫీడ్ మరియు స్టిల్ ఫోటోలను అందించగలదు. దాని నియంత్రణ, సాఫ్ట్ వేర్ విశ్లేషణ, నిర్ణయం తీసుకోవటానికి అవసరమైన కృత్రిమ మేథో సాధనాలను అంతర్నిర్మితంగా కలిగి ఉంది” అని ఒక సీనియర్ DRDO శాస్త్రవేత్త చెప్పారు. “సాయుధ దళాలతో పాటు, ఇది కేంద్ర సాయుధ పోలీసు దళాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది” అని ఆయన చెప్పారు.
ప్రత్యర్థులు దీనిని గుర్తించడం కష్టమయ్యేలా ఈ డ్రోన్ రూపొందించబడింది. ప్రపంచంలోని తేలికైన, అత్యంత చురుకైన నిఘా ప్లాట్ఫారమ్లలో ఇది ఒకటిగా అంచనా వేయబడింది. ఇది కొన్ని కిలోమీటర్ల మేరకు పరిశీలించగల సామర్థ్యం కలిగివుంటుంది. నిర్దేశించిన ప్రాంతంలో ప్రత్యర్థుల వ్యూహాత్మక కదలికలను సేకరించడం తోపాటు అవసరమైన చోట నిఘా ఉంచడం కోసం కూడా ఉద్దేశించబడింది.
‘భరత్’ ను అధిక ఎత్తులో, కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా పనిచేసేలా దృఢంగా రూపొందించారు. దీని పేలోడ్లో విభిన్న భౌగోళిక వాతావరణాలలో పనిచేయగల, పరారుణ మరియు రాత్రి దృష్టి పరికరాలు వున్న సెన్సార్ల శ్రేణి ఉంటుంది.
ఇలాంటి అధునాతన డ్రోన్లు ఆర్మీ కోరికల జాబితాలో చాలాకాలంగా ఉన్నాయి. అధిక మంచు వున్న ప్రాంతాలు, సమయాలలో దళాల కదలికలు కష్టతరమయ్యేటప్పుడు ముఖ్యంగా శీతాకాలంలో మంచు పర్వత మార్గాలపై నిఘా ఉంచడానికి ఇలాంటి సూక్ష్మ, అధునాతన డ్రోన్ల కోసం సైన్యం ఎప్పటినుంచో ఎదురు చూస్తోంది. అది ఇన్నాళ్ళకు సాకారమైంది.
Source : The Tribune