
ఉత్తర్ప్రదేశ్లో 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న కరడుగట్టిన నేర ముఠా నాయకుడు వికాస్ దూబే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ నగరంలో పట్టుబడ్డ వికాస్ను నేడు ఉదయం ఉత్తర్ప్రదేశ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు కాన్పూర్కు తరలించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కాన్వాయ్లోని ఓ వాహనం బోల్తాపడింది. దీన్ని అదునుగా భావించిన అతడు ఓ పోలీసు తుపాకిని లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. లొంగిపోవాలన్న పోలీసుల ఆదేశాల్ని బేఖాతరు చేశాడు. పైగా పోలీసుల పైకి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ అతణ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కారు బోల్తా పడ్డ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డట్లు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే దూబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్ అలియాస్ బౌవా దూబే గురువారం పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. కార్తికేయను బుధవారం అరెస్టు చేశారు. అతడిని ట్రాన్సిట్ రిమాండ్పై కాన్పుర్ తీసుకొస్తున్నప్పుడు మార్గమధ్యంలో వాహనం టైరు పంక్చరైందని పోలీసు అధికారులు తెలిపారు. ఇదే అదునుగా అతడు పోలీసుల నుంచి తుపాకి లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించాడని చెప్పారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడని తెలిపారు. ప్రవీణ్ను ఇటావా వద్ద జరిగిన ఒక ఎన్కౌంటర్లో పోలీసులు హతమార్చారు. మొత్తం మీద కాన్పూర్ సమీపంలోని బిక్రులో ఎనిమిది మంది పోలీసులు హతమైన నాటి నుంచి వికాస్ దూబేతో సహా ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు హతమయ్యారు.
అరెస్టుకు ముందుకు వికాస్ దూబే పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. బిక్రులో పోలీసుల్ని బలితీసుకున్న ఘటన తర్వాత కాన్పూర్ నుంచి రాజస్థాన్లోని కోట మీదుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి, హరియాణాలోని ఫరీదాబాద్ చేరుకున్నాడు. అక్కడ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఉజ్జయిన్ వచ్చాడు. ఇద్దరు అనుచరులతో కలిసి అతడు మధ్యప్రదేశ్ చేరుకున్నాడు. ఎట్టకేలకు గురువారం ఉజ్జయిన్ నగరంలోని మహాకాలేశ్వరుడి ఆలయం వద్ద దొరికాడు. దూబే అనుచరులిద్దరు కూడా పట్టుబడ్డారు.
గత శుక్రవారం రాత్రి కాన్పూర్కు సమీపంలోని బిక్రు గ్రామంలో తనను అరెస్టు చేయడానికి వస్తున్న పోలీసు బృందంపై దూబే, అతడి అనుచరులు ఆకస్మికంగా కాల్పులు జరిపి, ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను బలితీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. దూబే గురించి సమాచారం ఇచ్చినవారికి రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అతడిపై హత్యా నేరాలు సహా 60 క్రిమినల్ కేసులు ఉన్నాయి.





