
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సప్తగిరి మాసపత్రిక వివాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు పత్రిక చందాదారుడు రత్నవిష్ణు నివాసానికి తిరుపతి పోలీసులు వచ్చారు. సప్తగిరి మాసపత్రికతోపాటు సజీవ సువార్త అనే పుస్తకం రావడంపై వివరాలు సేకరిస్తున్నారు. తితిదే ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. తితిదే ప్రచురించే సప్తగిరి మాసపత్రికతో పాటు సువార్త పుస్తకం కూడా ఓకే పోస్టల్ కవర్లో అందినట్లు గుంటూరులోని మల్లికార్జునపేటకు చెందిన రత్నవిష్ణు తితిదే విజిలెన్స్ సెల్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది .
పోస్ట్ మ్యాన్ నూ ప్రశ్నిస్తాం: ఎస్ఐ
సప్తగిరి పుస్తక వ్యవహారంపై తిరుపతి ఎస్ఐ వీరేశ్ మాట్లాడుతూ సప్తగిరి పుస్తకంతో పాటు సువార్త పుస్తకం వచ్చిందని తమకు తెలిసిందన్నారు. గుంటూరు మల్లికార్జునపేటలో పత్రిక తీసుకున్న విష్ణును ప్రశ్నించామని, పుస్తకం అందిన వెంటనే ఇంట్లోకి వెళ్లి చూస్తే సువార్త సజీవ పుస్తకం కూడా ఉందని విష్ణు చెబుతున్నారని వీరేశ్ తెలిపారు. బుక్ పోస్టులో వస్తే కవర్ అంటించి ఉండదని చెప్పారు. ఈ వ్యవహారంలో పోస్ట్ మ్యాన్ను కూడా ప్రశ్నిస్తామని చెప్పారు. పూర్తి విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.





